రామన్నపేటలో ఉద్రిక్తత..

రామన్నపేటలో ఉద్రిక్తత..
  • పోలీసుల బందోబస్తు మధ్య..  ప్రజాభిప్రాయ సేకరణ 
  • అంబుజా గో బ్యాక్​ అంటూ నినాదాలు 
  • అఖిలపక్ష నాయకులను అడ్డుకున్న పోలీసులు

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామన్నపేటలో ఏర్పాటు చేయనున్న అదానీ అంబుజా సిమెంట్​ ఫ్యాక్టరీకి  ఇవాళ అధికారులు  ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 500 మంది  పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిమెంట్​ఫ్యాక్టరీ ఏర్పాటును అఖిలపక్ష నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్​ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.  పలుచోట్ల ముందస్తుగా వారిని హౌస్​ అరెస్ట్​ చేశారు.  చిట్యాల వద్ద నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే లింగయ్య అరెస్ట్  చేసి మునుగోడు పీఎస్ కు తరలించారు.  స్థానికేతరులను అడ్డుకొని వెనక్కి పంపించారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్​ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంబుబా గో బ్యాక్​ అంటూ రామన్నపేట  ప్రజలు, స్థానికులు నినాదాలు చేస్తున్నారు. 

ప్రజలే మరణశాసనం రాస్తారు: కేటీఆర్​ట్వీట్​ 

రామన్నపేటలో 12 గ్రామాల ప్రజలు సిమెంట్​ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారని బీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​తీవ్రంగా విమర్శించారు.  ట్విట్టర్​లో స్పందించిన కేటీఆర్​‘ రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ- అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య.  ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వం కాక మరేంటి?. వీరితో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలను ముందస్తు అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం రేవంత్ సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనం.   అరెస్ట్​ చేసిన బీఆర్ఎస్ నాయకులు,  ప్రజాసంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలి.  కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి.’ అని కేటీఆర్​ ఫైర్​ అయ్యాడు.

ALSO READ | బిగ్ బాస్ గంగవ్వపై కేసు నమోదు. ఎందుకంటే.?